రహస్య సమావేశం జరిగిన మూడు రోజుల తరువాత…

ఓల్డ్ మేజర్ చనిపోయాడు.

నిద్రలోనే ప్రశాంతంగా అతని ప్రాణం పోయింది.

ఫామ్‌లోని పండ్ల తోటలో ఒక చెట్టు కింద జంతువులు అతనిని పాతిపెట్టాయి.

ఓల్డ్ మేజర్ ఇక లేడు.

కాని మేనర్ ఫామ్‌లో జంతువుల జీవితం మాత్రం ఎప్పటిలాగే ఉన్నది.

మిస్టర్ జోన్స్ ఇంకా వాటి యజమానే.

జంతువులు ప్రతి రోజూ ఉదయాన్నే లేవాలి.

పొలాలలో పని చేయాలి.

బండ్లు లాగాలి.

ఆవులు పాలు ఇవ్వాలి.

కోళ్లు గుడ్లు పెట్టాలి.

మిస్టర్ జోన్స్ చెప్పిన మాట వినాలి.

బయట నుంచి చూస్తే…

మేనర్ ఫామ్‌లో ఏమీ మారినట్లు కనిపించలేదు.

కాని జంతువుల మనసులలో మాత్రం ఒక పెద్ద మార్పు మొదలైనది.

ఓల్డ్ మేజర్ చనిపోయాడు.

కాని అతను చెప్పిన మాటలు జీవించే ఉన్నాయి.


ఆ రాత్రి అతను చెప్పిన విషయాలను జంతువులు మర్చిపోలేకపోయాయి.

మనుషులు యజమానులుగా లేని ప్రపంచం గురించి అతను చెప్పిన మాటలు వాటికి గుర్తున్నాయి.

జంతువులే తమ కోసం పని చేసుకునే భవిష్యత్తు గురించి అతను చెప్పిన కల గుర్తు ఉన్నది.

అన్నింటి కంటే ముఖ్యంగా…

ఒక మాట జంతువుల మనసులలో బలంగా నాటుకుపోయింది.

తిరుగుబాటు.

ఆ తిరుగుబాటు ఎప్పుడు వస్తుందో ఓల్డ్ మేజర్‌కు తెలియదు. ఆ తిరుగుబాటు ఎప్పుడైనా కావచ్చు. ఎన్నో సంవత్సరాల తరువాత రావచ్చు.

ఆ రోజు చూడటానికి ఇప్పుడు ఉన్న జంతువుల్లో ఒక్కటి కూడా బతికి ఉండకపోవచ్చు.

అయినా సరే…

దాని కోసం సిద్ధం కావాలని కొన్ని జంతువులు భావించాయి.

వాటిలో ముఖ్యంగా ముందుకొచ్చినవి పందులు.

ఫామ్‌లోని జంతువుల అన్నింటిలో పందులే ఎక్కువ తెలివైనవని అందరూ భావించేవారు.

కొత్త విషయాలను అవి త్వరగా అర్థం చేసుకోగలవు.

కష్టమైన ఆలోచనలను ఇతరులకు వివరించగలవు.

పనులను పద్ధతిగా నిర్వహించగలవు.

అలా కొద్దికాలంలోనే మూడు పందులు ముఖ్యమైన నాయకులుగా ఎదిగాయి.

వాటి పేర్లు—

స్నోబాల్.

నెపోలియన్.

స్క్వీలర్.


నెపోలియన్ పెద్దగా గంభీరంగా కనిపించే పంది.

అతను ఎక్కువగా మాట్లాడేవాడు కాదు.

కాని ఏదైనా కావాలని నిర్ణయించుకున్నాడంటే…

దానిని ఎలా సాధించాలో అతనికి బాగా తెలుసు.

అతనిలో ఏదో ఒక రకమైన అధికారం కనిపించేది.

ఎక్కువగా మాట్లాడటం కంటే పనులు చేయించడానికే అతను ఇష్టపడేవాడు.

స్నోబాల్ మాత్రం అతనికి పూర్తిగా భిన్నం.

చురుకైనవాడు.

ఉత్సాహంగా ఉండేవాడు.

ఎప్పుడూ కొత్త ఆలోచనలతో కనిపించేవాడు.

ముఖ్యంగా, అతను చాలా బాగా మాట్లాడగలడు.

కష్టమైన విషయాలను కూడా ఇతర జంతువులకు సులభంగా అర్థమయ్యేలా చెప్పగలడు.

అందుకే చాలా జంతువులకు స్నోబాల్ మాటలు వినడం ఇష్టం.

ఇక మూడవ పంది…

స్క్వీలర్.

చిన్నగా, గుండ్రంగా ఉండే పంది.

కాని అతనికి ఒక అసాధారణమైన శక్తి ఉన్నది.

అది శారీరక బలం కాదు.

మాటల బలం.

స్క్వీలర్ కేవలం మాట్లాడడు.

ఎదుటి వారు తన మాటలు నమ్మేలా చేస్తాడు.

అతను మాట్లాడుతున్నప్పుడు అటూ ఇటూ కదులుతాడు.

కళ్లు మెరుస్తుంటాయి.

గొంతులో నమ్మకం వినిపిస్తుంది.

అతను ఏదైనా విషయం గురించి వివరించడం మొదలుపెడితే…

కొద్దిసేపటి క్రితం అసాధ్యం అనిపించిన విషయం కూడా నిజమేనేమో అనిపిస్తుంది.

మనకు స్పష్టంగా తెలుసు అనుకున్న విషయంపైనా సందేహం వచ్చేలా మాట్లాడగలడు.

ఈ మూడు పందులు ఓల్డ్ మేజర్ చెప్పిన ఆలోచనలను ఒక సిద్ధాంతంగా మార్చడం మొదలుపెట్టాయి.

దానికి ఒక పేరు పెట్టాయి.

యానిమలిజం.


వారానికి కొన్ని రాత్రులు…

మిస్టర్ జోన్స్ నిద్రపోయిన తరువాత…

పందులు మిగతా జంతువులతో కలిసి గోదాములో రహస్య సమావేశాలు నిర్వహించేవి.

అక్కడ వాటికి యానిమలిజం గురించి వివరించేవి.

ఒకరోజు మనుషుల ఆధిపత్యానికి కాలం చెల్లుతుందని చెప్పేవి.

ఆ రోజు కోసం సిద్ధంగా ఉండాలని చెప్పేవి.

కాని ఈ కొత్త ఆలోచనలను అన్ని జంతువులకూ అర్థమయ్యేలా చెప్పడం అంత సులభం కాదు.

కొన్ని జంతువులకు అవి అసలు అర్థమే కాలేదు.

మరికొన్నింటికి అర్థమయ్యాయి.

కాని భయం వేసింది.

మరికొన్ని జంతువులకు స్వేచ్ఛ కంటే తమ చిన్న చిన్న సౌకర్యాలే ముఖ్యంగా అనిపించేవి.

మాలీ అలాంటి జంతువులలో ఒకటి.

ఒకరోజు ఆమె స్నోబాల్‌ను ఒక ప్రశ్న అడిగింది.

“తిరుగుబాటు జరిగితే… మనకు చక్కెర దొరుకుతుందా?”

స్నోబాల్ లేదు అన్నాడు.

ఫామ్‌లో చక్కెర తయారు చేయరు.

పైగా గుర్రానికి చక్కెర అవసరం కూడా లేదని చెప్పాడు.

మాలీ ముఖంలో నిరాశ కనిపించింది.

ఆమె మరో ప్రశ్న అడిగింది.

“మరి నా జూలులో రిబ్బన్లు కట్టుకోవచ్చా?”

స్నోబాల్ ఆమెకు వివరించాడు.

రిబ్బన్లు మనుషులు జంతువులపై చూపించే ఆధిపత్యానికి గుర్తులు.

స్వేచ్ఛ పొందిన జంతువులకు అలాంటి అలంకరణలు అవసరం లేదన్నాడు.

స్వేచ్ఛ రిబ్బన్ల కంటే విలువైనది.

కాని మాలీకి ఆ మాటలు పెద్దగా నచ్చలేదు.

ఆమెకు చక్కెర అంటే ఇష్టం.

రిబ్బన్లు అంటే కూడా చాలా ఇష్టం.

వాటిని వదులుకోవలసి వస్తే…

ఆ స్వేచ్ఛ అంత గొప్పదిగా ఆమెకు అనిపించలేదు.


మోసెస్ అనే కాకి మరో సమస్యగా మారింది. మిస్టర్ జోన్స్‌కు మోసెస్ ప్రత్యేకమైన పెంపుడు పక్షి.

అది పెద్దగా పని చేసేది కాదు.

కాని మాట్లాడటం మాత్రం చాలా ఎక్కువ.

మోసెస్ జంతువులకు ఒక అద్భుతమైన ప్రదేశం గురించి చెప్పేవాడు.

దాని పేరు—

షుగర్‌క్యాండీ మౌంటెన్.

జంతువులు చనిపోయిన తరువాత అక్కడికి వెడతాయని మోసెస్ చెప్పేవాడు.

అది మేఘాలకు చాలా పైన ఎక్కడో ఉన్నదట.

అక్కడ ప్రతిరోజూ ఆదివారమే.

పని ఉండదు.

బాధ ఉండదు.

ఆకలి ఉండదు.

తినడానికి కావలసినంత ఆహారం ఉంటుంది.

అది వినడానికి ఒక అద్భుతమైన ప్రపంచంలా అనిపించేది.

కాని పందులకు మోసెస్ చెప్పే కథలు అస్సలు నచ్చేవి కాదు.

షుగర్‌క్యాండీ మౌంటెన్ అనే ప్రదేశమే లేదని అవి చెప్పేవి.

జంతువులు చనిపోయిన తరువాత వచ్చే మంచి జీవితం గురించి కలలు కనడం కాదు…

ఇప్పుడు ఉన్న జీవితాన్ని మార్చుకోవడం గురించి ఆలోచించాలి అని అవి చెప్పేవి.

అయినా కొన్ని జంతువులకు మోసెస్ కథ నచ్చేది.

ఎందుకంటే వాటి ప్రస్తుత జీవితం చాలా కష్టంగా ఉన్నది.

కనీసం చనిపోయిన తరువాత అయినా ఒక అందమైన ప్రపంచం తమ కోసం ఎదురు చూస్తున్నదని నమ్మడం వాటికి ఓదార్పునిచ్చేది.

అందుకే మోసెస్ మాటలు తప్పని జంతువులకు నచ్చజెప్పడానికి పందులు చాలా కష్టపడవలసి వచ్చేది.


అయితే రెండు జంతువులు మాత్రం పందులు చెప్పే విషయాలను చాలా నమ్మకంగా స్వీకరించాయి.

బాక్సర్.

క్లోవర్.

యానిమలిజంలోని ప్రతి క్లిష్టమైన ఆలోచన వాటికి పూర్తిగా అర్థం కాకపోవచ్చు.

కాని పందుల మీద వాటికి నమ్మకం ఉన్నది.

ఓల్డ్ మేజర్ చెప్పింది నిజమేనని అవి బలంగా నమ్మాయి.

మిగతా జంతువులకు సందేహాలు వచ్చినప్పుడు బాక్సర్, క్లోవర్ వాటికి ధైర్యం చెప్పేవి.

అలా…

నెమ్మదిగా ఓల్డ్ మేజర్ ఆలోచనలు ఫామ్ అంతా వ్యాపించాయి.

మేనర్ ఫామ్‌లో బయటకు కనిపించని ఒక మార్పు జరుగుతున్నది.

మిస్టర్ జోన్స్‌కు మాత్రం దాని గురించి ఏమీ తెలియదు.

అతనికి అవి కేవలం జంతువులు.

తన కోసం పని చేసే జీవులు.

తన ఆస్తి.

కాని అవే జంతువులు…

అతను లేని భవిష్యత్తు గురించి రహస్యంగా మాట్లాడుతున్నాయని మిస్టర్ జోన్స్ కి తెలియదు.


అంతలో ఎవరూ ఊహించని సంఘటన జరిగింది.

తిరుగుబాటు అనుకున్న దాని కంటే చాలా ముందుగానే వచ్చింది.

ఒకప్పుడు మిస్టర్ జోన్స్ ఫామ్‌ను బాగానే చూసుకునేవాడు.

కాని కొంతకాలంగా అతని పరిస్థితి మారిపోయింది.

అతనికి డబ్బు నష్టం వచ్చింది.

దానితో నిరాశ పెరిగింది.

మద్యం తాగడం కూడా ఎక్కువైనది.

అతను తాగడం ఎక్కువైన కొద్దీ…

ఫామ్ పరిస్థితి దిగజారిపోయింది.

భవనాలకు మరమ్మతులు అవసరం.

కాని ఎవరూ పట్టించుకోలేదు.

కంచెలు పాడైపోతున్నాయి.

పొలాల్లో కలుపు మొక్కలు పెరుగుతున్నాయి.

జంతువులకు సరైన సమయంలో ఆహారం కూడా ఇవ్వడం లేదు.

మిస్టర్ జోన్స్ ఎక్కువ సమయం ఇంట్లో కూర్చుని పేపర్ చదువుతూ, మద్యం తాగుతూ, తన సమస్యల గురించి బాధపడుతూ గడిపేవాడు.

అతని పనివాళ్లు కూడా సోమరులు అయ్యారు.

మేనర్ ఫామ్ మొత్తం నెమ్మదిగా పాడైపోతోంది.

జంతువులు ఇవన్నీ గమనించాయి.

కాని ఏమీ చేయలేకపోయాయి.

ఎందుకంటే వాటి ఆహారం కోసం ఇంకా మనుషులపైనే ఆధారపడవలసి ఉన్నది.


ఆ రోజు జూన్ నెలలో ఒక శనివారం.

మిస్టర్ జోన్స్ పట్టణానికి వెళ్లాడు.

అక్కడ విపరీతంగా మద్యం సేవించాడు.

ఆ రాత్రి కూడా సమయానికి ఇంటికి రాలేదు.

ఆదివారం ఉదయం పనివాళ్లు ఆవుల పాలు పితికారు.

ఆ తరువాత కుందేళ్ల వేటకు వెళ్లిపోయారు.

కాని…

జంతువులకు ఆహారం పెట్టడం మర్చిపోయారు.

ఉదయం గడిచిపోయింది.

జంతువులు ఎదురు చూశాయి.

ఆహారం రాలేదు.

మధ్యాహ్నం అయింది.

ఇంకా ఆహారం లేదు.

ఆకలి పెరుగుతున్నది.

ఆవులకు ఇబ్బందిగా ఉన్నది.

గుర్రాలు అసహనంగా తిరుగుతున్నాయి.

గొర్రెలు ఆకలితో ఉన్నాయి.

ఎవరో ఒకరు వచ్చి తమకు ఆహారం పెడతారని అన్ని జంతువులూ ఎదురుచూశాయి.

కాని ఎవరూ రాలేదు.

సాయంత్రం అయింది.

మిస్టర్ జోన్స్ నిద్రపోతున్నాడు.

అతని పనివాళ్లు ఎక్కడికో వెళ్లారు.

జంతువులకు ఇంకా ఆహారం లేదు.

చివరకు…

వాటి సహనం పూర్తిగా నశించింది.


ఒక ఆవు ముందుకొచ్చింది.

తన కొమ్ములతో ఆహారం నిల్వ చేసే గది తలుపును బలంగా కొట్టింది.

తలుపు తెరుచుకుంది.

లోపల…

ఆహారం!

అక్కడ ఆహారం నిల్వ చేసి ఉన్నది.

జంతువులు ఒక్కసారిగా లోపలికి దూసుకెళ్లాయి.

ఆకలితో తినడం మొదలుపెట్టాయి.

ఆ శబ్దానికి మిస్టర్ జోన్స్ నిద్రలేచాడు.

ఏం జరుగుతున్నదో చూసేందుకు పరుగెత్తుకుంటూ వచ్చాడు.

అతని వెనుక పనివాళ్లు కూడా వచ్చారు.

వారి చేతుల్లో…

కొరడాలు ఉన్నాయి.

ఆహారం తింటున్న జంతువులను చూసిన వెంటనే వాటిని కొట్టడం ప్రారంభించారు.

సాధారణంగా అయితే…

జంతువులు భయపడి వెనక్కి వెళ్లిపోయేవి.

ఇంతకు ముందు కూడా చాలా సార్లు కొరడా దెబ్బలు తిన్నాయి.

కొరడా అంటే భయపడటం వాటికి అలవాటైపోయింది.

కాని …

ఆ రోజు పరిస్థితి వేరు.

వాటికి ఆకలిగా ఉన్నది.

వాటికి కోపంగా ఉన్నది.

ఎన్నో సంవత్సరాలుగా పని చేసి అలసిపోయాయి.

బహుశా…

ఓల్డ్ మేజర్ చెప్పిన మాటలు కూడా వాటి మనసులలో ఇంకా మెదులుతున్నాయి.

ఎవరూ ఆదేశించలేదు.

ఎవరూ ముందుగా ప్రణాళిక వేయలేదు.

అయినా…

జంతువులు తిరగబడ్డాయి.


ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

మిస్టర్ జోన్స్, అతని పనివాళ్లు జంతువుల మధ్య చిక్కుకున్నారు.

గుర్రాలు కాళ్లతో తన్నాయి.

ఆవులు ముందుకు దూసుకొచ్చాయి.

పందులు వారిపైకి పరిగెత్తాయి.

గొర్రెలు కూడా వెనక్కి తగ్గలేదు.

మనుషులు కొరడాలు ఊపుతున్నారు.

కాని జంతువులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి.

అప్పుడు…

జంతువులకు మొదటిసారి ఒక గొప్ప నిజం అర్థమైనది.

మనుషులు కూడా భయపడతారు.

జంతువులు తమపై తిరగబడతాయని మిస్టర్ జోన్స్, అతని పనివాళ్లు ఎప్పుడూ ఊహించలేదు.

వారు చాలా ఆశ్చర్యపోయారు.

జంతువులు ముందుకు వస్తూనే ఉన్నాయి.

మనుషులు వెనక్కి తగ్గడం మొదలుపెట్టారు.

కొద్దిసేపటికే…

వెనక్కి తిరిగారు.

పరుగెత్తారు.

ఫామ్ యార్డ్ దాటి రోడ్డు వైపు పరుగులు తీశారు.

జంతువులు వారిని తరిమాయి.

కొన్ని నిమిషాల్లోనే…

మిస్టర్ జోన్స్, అతని పనివాళ్లు మేనర్ ఫామ్ బయట ఉన్నారు.

జంతువులు గేటు మూసేశాయి.

ఆ తరువాత…

అక్కడ నిశ్శబ్దం.

కొన్ని క్షణాల పాటు ఏం జరిగిందో వాటికే అర్థం కాలేదు.

మిస్టర్ జోన్స్ వెళ్లిపోయాడు.

అతని పనివాళ్లు వెళ్లిపోయారు.

మేనర్ ఫామ్‌లో ఒక్క మనిషి కూడా లేడు.

ఓల్డ్ మేజర్ కలలుగన్న తిరుగుబాటు…

పందులు సిద్ధం చేస్తున్న తిరుగుబాటు…

ఎవరూ ఊహించని విధంగా జరిగిపోయింది.

జంతువులు గెలిచాయి.


వాటికి తమ విజయాన్ని నమ్మడం కూడా కష్టంగా అనిపించింది.

ఫామ్‌లో ఎక్కడైనా మనిషి దాక్కుని ఉన్నాడేమో అని వెతికాయి.

పొలాలు చూశాయి.

షెడ్లు చూశాయి.

భవనాలు చూశాయి.

రోడ్డు వైపు చూశాయి.

ఎవరూ లేరు.

అప్పుడు వాటి ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి.

ఇప్పుడు ఫామ్ జంతువుల ది !

జంతువులు ఫామ్ సరిహద్దుల చుట్టూ వేగంగా పరుగెత్తాయి.

తమ జీవితంలో మొదటిసారి అవి ఆ భూమిని మరోలా చూస్తున్నాయి.

తమ కాళ్ల కింద ఉన్న గడ్డి…

తమదే.

పొలాలు…

తమవే.

చెట్లు…

తమవే.

నీరు…

తమదే.

కంటికి కనిపిస్తున్నదంతా…

ఇప్పుడు జంతువులదే.

అవి ఆనందంతో గడ్డిలో దొర్లాయి.

కాళ్లు గాల్లోకి విసిరాయి.

తాజా గడ్డిని నోటినిండా తిన్నాయి.

పొలాల వైపు ఆశ్చర్యంగా చూశాయి.

ఇన్ని సంవత్సరాలు…

ఈ భూమిలో అవే పని చేశాయి.

కాని ఫలితం మాత్రం మరొకరిది.

ఇప్పుడు…

ఈ భూమి నిజంగా వాటిది.


ఆ తరువాత జంతువులు ఫామ్ భవనాల దగ్గరకు తిరిగి వచ్చాయి.

చుట్టూ చూస్తే మనుషుల ఆధిపత్యాన్ని గుర్తు చేసే వస్తువులు ఎన్నో కనిపించాయి.

గుర్రాల నోటికి వేసే బిట్లు.

ముక్కుకు పెట్టే రింగులు.

గొలుసులు.

కత్తులు.

కొరడాలు.

రిబ్బన్లు.

అన్నింటినీ ఒకచోట చేర్చాయి జంతువులు.

కొన్ని వస్తువులను బావిలో పడేశాయి.

మరికొన్నింటిని మంటల్లో వేసి కాల్చేశాయి.

కొరడాలు మంటల్లో కాలిపోతుండటం చూసి బాక్సర్ చాలా సంతోషించాడు.

ఎన్నో సంవత్సరాలుగా కొరడా అంటే మనిషి అధికారం.

భయం.

శిక్ష.

ఇప్పుడు అదే కొరడా…

వాటి కళ్ల ముందే మంటల్లో కాలిపోతున్నది.

గుర్రాల రిబ్బన్లను కూడా స్నోబాల్ మంటల్లోకి విసిరేశాడు.

బట్టలు, అలంకరణలు మనుషుల అలవాట్లని గుర్తు చేశాడు.

స్వేచ్ఛ పొందిన జంతువులకు అవి అవసరం లేదన్నాడు.

మాలీకి మాత్రం అది పెద్దగా నచ్చలేదు.

కాని మిగతా జంతువులు ఆనందంలో ఉండటంతో ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

తమ పాత జీవితానికి సంబంధించిన వస్తువులను ఒక్కొక్కటిగా నాశనం చేస్తున్నప్పుడు…

తమ బానిసత్వాన్నే నాశనం చేస్తున్నట్లు వాటికి అనిపించింది.


కాని ఇంకా ఒక ప్రదేశంలోకి అవి వెళ్లలేదు.

ఫామ్ హౌస్.

జంతువులు నెమ్మదిగా ఆ ఇంటి దగ్గరకు వచ్చాయి.

ఇన్ని సంవత్సరాలుగా ఆ ఇల్లు మిస్టర్ జోన్స్ అధికారానికి గుర్తు.

అక్కడ మనుషులు నివసించేవారు.

ఇప్పుడు…

వాటిని అడ్డుకునే మనిషి ఎవరూ లేరు.

స్నోబాల్, నెపోలియన్ కలిసి తలుపు తెరిచారు.

జంతువులు చాలా జాగ్రత్తగా లోపలికి అడుగుపెట్టాయి.

దాదాపు కాలి వేళ్ల మీద నడుస్తున్నట్లు ఒక్కో గదిని చూశాయి.

అక్కడున్న ప్రతిదీ వాటికి ఆశ్చర్యంగా అనిపించింది.

మెత్తని మంచాలు.

కార్పెట్లు.

అద్దాలు.

ఫర్నిచర్.

గోడలపై చిత్రాలు.

అవి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాయి.

తాము జీవితమంతా గడ్డి మీద పడుకుంటుంటే…

మనుషులు ఇన్ని సౌకర్యాల మధ్య జీవించారా?

అయినా జంతువులు ఆ ఇంటిని ధ్వంసం చేయలేదు.

ఒక నిర్ణయం తీసుకున్నాయి.

ఫామ్ హౌస్‌ను ఒక మ్యూజియంలా ఉంచాలి.

ఏ జంతువూ అక్కడ నివసించకూడదు.

అది చాలా ముఖ్యమైన నిర్ణయం.

తాము మనుషులను తరిమేసింది…

మనుషుల్లా మారడానికి కాదు.

వారి కంటే భిన్నమైన ప్రపంచాన్ని నిర్మించడానికి.

అప్పుడు వాటి ఆలోచన అదే.


అందరూ ఇంటి నుంచి బయటకు వస్తుండగా…

ఒక్కసారిగా మాలీ కనిపించడం లేదని గుర్తించారు.

ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు.

చివరకు ఒక బెడ్‌రూమ్‌లో కనిపించింది.

మాలీ అద్దం ముందు నిలబడి ఉన్నది.

ఆమెకు అక్కడ ఒక నీలిరంగు రిబ్బన్ దొరికింది.

దానిని తన భుజం దగ్గర పెట్టుకుని…

అద్దంలో తన అందాన్ని చూసుకుంటున్నది.

ఫామ్ మొత్తం మారిపోయి ఉండవచ్చు.

విప్లవం వచ్చి ఉండవచ్చు.

మిస్టర్ జోన్స్ పారిపోయి ఉండవచ్చు.

కాని మాలీకి మాత్రం…

రిబ్బన్లు ఇంకా రిబ్బన్లే.

మిగతా జంతువులకు ఆమె ప్రవర్తన అసహ్యంగా అనిపించింది.

అందరూ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.


ఆ రాత్రి జంతువులు తమ జీవితంలో ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా నిద్రపోయాయి.

అవి బాగా అలసిపోయాయి.

కాని…

ఇప్పుడు అవి స్వేచ్ఛగా ఉన్నాయి.

మరుసటి రోజు తెల్లవారగానే నిద్రలేచాయి.

ఒక్క క్షణం…

నిన్న జరిగినదంతా కలేమో అని కొన్ని జంతువులకు అనిపించి ఉండవచ్చు.

కాని వెంటనే గుర్తొచ్చింది.

జోన్స్ వెళ్లిపోయాడు.

ఫామ్ తమది.

అన్ని బయటకు పరుగెత్తాయి.

కలిసి ఒక ఎత్తైన ప్రదేశానికి వెళ్లాయి.

అక్కడి నుంచి ఫామ్ మొత్తం కనిపిస్తున్నది.

ఉదయపు సూర్యుడు పైకి వస్తున్నాడు.

వాటి కళ్ల ముందు మేనర్ ఫామ్ పొలాలు విస్తరించి ఉన్నాయి.

వాటి పొలాలు.

జంతువులు కొన్ని క్షణాలు మౌనంగా చూస్తూ నిలబడ్డాయి.

తరువాత కొండ దిగువకు పరుగెత్తాయి.

మంచుతో తడిసిన గడ్డిలో దొర్లాయి.

గడ్డి తిన్నాయి.

కాళ్లతో మట్టిని పైకి ఎగరేశాయి.

నేల వాసన చూశాయి.

ప్రతిదీ మొదటిసారి చూస్తున్నట్లు వాటికి అనిపించింది.

జీవితమంతా ఈ పొలాల్లోనే పని చేశాయి.

కాని ఎప్పుడూ వాటిని తమవిగా భావించలేదు.

ఇప్పుడు…

అవి నిజంగా వాటివే.

నమ్మడం కూడా కష్టంగా ఉన్నది.


కొద్దిసేపటి తర్వాత జంతువులన్నీ తిరిగి ఫామ్ యార్డ్‌కు వచ్చాయి.

అప్పుడు స్నోబాల్, నెపోలియన్ అందరినీ ఒక చోటికి పిలిచారు.

వాళ్లు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతున్నారు.

గత కొన్ని నెలలుగా…

పందులు తమంతట తామే చదవడం, రాయడం నేర్చుకున్నాయి.

మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి.

పందులు వాటిని ప్రధాన గేటు దగ్గరకు తీసుకెళ్లాయి.

గేటు మీద పెద్ద అక్షరాలతో ఒక పేరు ఉంది.

‘మేనర్ ఫామ్’

స్నోబాల్ ఒక బ్రష్, పెయింట్ తీసుకున్నాడు.

నిచ్చెన ఎక్కాడు.

పాత పేరుపై రంగు వేసి దాన్ని చెరిపేశాడు.

తరువాత కొత్త పేరు రాశాడు.

జంతువులు అన్నీ తలలు పైకెత్తి చూశాయి.

ఇకపై అది మేనర్ ఫామ్ కాదు.

దాని కొత్త పేరు—

*‘యానిమల్ ఫామ్’.

మేనర్ ఫామ్ అనే పేరు పాత ప్రపంచానికి చెందినది.

యానిమల్ ఫామ్…

ఇప్పుడు జంతువుల ప్రపంచానికి చెందిన పేరు.

జంతువులన్నీ ఆనందంతో అరవడం మొదలుపెట్టాయి.

కాని స్నోబాల్ పని ఇంకా పూర్తికాలేదు.

స్నోబాల్, నెపోలియన్ వాటిని పెద్ద గోదాము దగ్గరకు తీసుకెళ్లారు.

అక్కడ ఒక గోడపై…

పందులు చాలా ముఖ్యమైన విషయాన్ని రాయబోతున్నాయి.

తమ రహస్య సమావేశాల సమయంలో యానిమలిజం సిద్ధాంతాన్ని ఏడు ముఖ్యమైన నియమాలుగా మార్చాయి.

ఇకపై యానిమల్ ఫామ్‌లో జీవితం ఈ నియమాల ప్రకారం నడవాలి.

వాటిని—

ఏడు ఆజ్ఞలు

అని పిలిచారు.

స్నోబాల్ నిచ్చెన ఎక్కి వాటిని గోడ మీద రాయడం మొదలుపెట్టాడు.

జంతువులన్నీ కింద నిలబడి చూస్తున్నాయి.

రెండు కాళ్లపై నడిచే వారిని శత్రువులుగా భావించాలి.

నాలుగు కాళ్లపై నడిచేవారు లేదా రెక్కలు ఉన్న వారు మిత్రులు.

జంతువులు మనుషుల అలవాట్లను అనుకరించకూడదు.

బట్టలు వేసుకోకూడదు.

మంచాలపై పడుకోకూడదు.

మద్యం తాగకూడదు.

ఒక జంతువు మరో జంతువును చంపకూడదు.

అన్నింటికంటే ముఖ్యంగా—

జంతువులు అన్నీ సమానం.

జంతువులు గోడపై ఉన్న ఆ నియమాలను చూస్తూ నిలబడ్డాయి.

ఇకపై తమ కొత్త సమాజానికి అవే చట్టాలు.

మనుషుల యజమానులు ఉండరు.

క్రూరత్వం ఉండదు.

ఒక జంతువు మరో జంతువును పాలించదు.

అందరూ సమానం.

అందరికీ స్వేచ్ఛ.

వాటి ముందు ఒక కొత్త జీవితం ప్రారంభమవుతున్నట్లు కనిపించింది.


అంతలో ఆవులు పెద్దగా అరవడం మొదలుపెట్టాయి.

వాటికి ఇరవై నాలుగు గంటలుగా పాలు పితకలేదు.

పొదుగులు పాలతో నిండిపోయి చాలా నొప్పిగా ఉన్నాయి.

పందులు వెంటనే బకెట్లు తీసుకొచ్చాయి.

కొంచెం కష్టపడినా…

చివరకు ఆవుల పాలు పితకగలిగాయి.

కొద్దిసేపటికి అక్కడ కొన్ని బకెట్ల నిండా తాజా, చిక్కటి పాలు ఉన్నాయి.

జంతువులన్నీ వాటి వైపు చూశాయి.

పాలు విలువైనవని అందరికీ తెలుసు.

అప్పుడు ఒక సహజమైన ప్రశ్న వచ్చింది.

“ఈ పాలన్నీ ఏమవుతాయి?”

కొన్ని జంతువులు…

అందరికీ పంచుతారేమో అనుకున్నాయి.

అప్పుడు నెపోలియన్ పాల బకెట్ల ముందు నిలబడ్డాడు.

పాల గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు అన్నాడు.

ఇప్పుడు అంత కంటే ముఖ్యమైన పని ఉన్నదని చెప్పాడు.

పొలాల్లో ఎండుగడ్డి కోతకు సిద్ధంగా ఉన్నది.

దానిని వెంటనే కోయాలి.

స్నోబాల్ ముందుగా వెళ్లి పని మొదలుపెట్టాలని చెప్పాడు.

తాను కొద్దిసేపటిలో వస్తానని అన్నాడు.

జంతువులు అతని మాట నమ్మాయి.

వాటికి ఇంకా స్వేచ్ఛ వచ్చిన ఆనందం తగ్గలేదు.

చేయవలసిన పని చాలా ఉన్నది.

అన్నింటికంటే ముఖ్యంగా…

జీవితంలో మొదటిసారి అవి చేసే పని మిస్టర్ జోన్స్ కోసం కాదు.

తమ కోసమే.

అందుకే పని చేయగలిగిన ప్రతి జంతువూ పొలం వైపు బయలుదేరింది.

వాటి వెనుక…

ఫామ్ హౌస్ ఉన్నది.

గోదాము ఉన్నది.

గోడపై కొత్తగా రాసిన ఏడు ఆజ్ఞలు ఉన్నాయి.

మరియు…

పాలతో నిండిన బకెట్లు ఉన్నాయి.


ఆ రోజు జంతువులన్నీ ఎంతో కష్టపడి పనిచేశాయి.

తమ సొంత ఫామ్ కోసం చేస్తున్న మొదటి రోజు పని అది.

అందుకే అలసట ఉన్నా…

వాటిలో గర్వం ఉన్నది.

సాయంత్రం పని ముగించుకుని తిరిగి వచ్చాయి.

అప్పుడు…

ఒక విషయం వాటి దృష్టిలో పడింది.

ఉదయం అక్కడ ఉన్న పాల బకెట్లు…

ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి.

పాలు మాయమయ్యాయి.

అవి ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు.

ఎవరు తీసుకెళ్లారో ఎవరూ చూడలేదు.

ఏం జరిగిందో కూడా ఎవరూ చెప్పలేకపోయారు.

అది ఒక చిన్న రహస్యం.

ఆ రోజు జరిగిన గొప్ప సంఘటనలతో పోలిస్తే…

బహుశా అది అంత ముఖ్యమైన విషయంగా వాటికి అనిపించలేదు.

మిస్టర్ జోన్స్ వెళ్లిపోయాడు.

అవి స్వేచ్ఛ పొందాయి.

ఫామ్ ఇప్పుడు వాటిది.

గోడపై ఏడు ఆజ్ఞలు ఉన్నాయి.

కొత్త జీవితం ప్రారంభమైంది.

అలాంటి సమయంలో…

కొన్ని బకెట్ల పాలు ఏమంత పెద్ద విషయం?

అందుకే జంతువులు దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు.

కాని…

వాటి తిరుగుబాటు జరిగి ఎంతోకాలం కాలేదు.

కొత్త సమాజం అప్పుడే మొదలైనది.

అందరూ సమానమని గోడపై అప్పుడే రాశారు.

అయినా…

చాలా జంతువులు గమనించకుండానే…

యానిమల్ ఫామ్‌లో ఏదో మారడం అప్పుడే మొదలైనది.