తెలుగునాట సాంస్కృతిక పునరుజ్జీవనానికి నిఖార్సయిన ప్రతినిధి కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు. మాతృభాషలో విద్యాబోధన ప్రయోజన కరమని, సొంత భాషలో పాఠ్య గ్రంథ రచన, శాస్త్ర గ్రంథ ప్రచురణ జాతిని విజ్ఞానవంతులను చేస్తుందని విశ్వసించారు. ‘తల్లి భాషను గౌరవించు, పరభాషను ప్రేమించు’ అనే సూత్రంతో తెలుగును ఆరాధిస్తూనే వివిధ భాషలను నేర్చారు. సంస్కృతం, తెలుగు, తమిళ, కన్నడ, ఆంగ్ల, మరాఠా, హిందీ, గుజరాతీ, బెంగాలీ భాషలలో పండితులు. తత్త్వశాస్త్రం ఆయన అభిమాన అంశం అయినప్పటికీ, అనేక సాహిత్యాలలో, శాస్త్రాలలో పాండిత్యం ఆర్జించారు. నిజాం పాలనలో మసకబారిన తెలుగు భాషా సాహిత్యాలకు విశిష్ట సేవలందిస్తూ, ముఖ్యంగా ఆ ఏలుబడిలో సాంస్కృతిక, సంఘ చైతన్యానికి, ఆంధ్రోద్యమానికి దోహదం చేసిన మనీషి. హైదరాబాద్ లోని శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం (1901) అలా ఆవిర్భవించినదే. తెలుగులో తొలితరం కథా రచయిత్రిగా ప్రసిద్ధి పొందిన బండారు అచ్చమాంబ ఆయనకు రెండేళ్ల తేడాతో అక్కగారు. బడికి వెళ్లని ఆమెకు ఆయనే గురువయ్యారు. ఇద్దరూ కలసి చదువుకున్నారు. నాగపూర్ లో ఉండే బావ (అక్క భర్త కూడా) మాధవరావు తెప్పించే తెలుగు పత్రికలను చదివి పరస్పరం ప్రేరణ పొందేవారు. ప్లేగు వ్యాధితో 31 ఏళ్ల పిన్నవయసులో అక్క అకాల మరణంతో ఆయన తీవ్రంగా కలత చెందారు. ఆమె అంటే వల్లమాలిన ప్రేమానురాగాలు గల ఆయన తన కుమార్తెకు అక్కగారి పేరు (కొమఱ్ఱాజు అచ్బమాంబ) పెట్టుకున్నారు. కొమఱ్ఱాజు అచ్బమాంబ వైద్యురాలిగా ప్రజాసేవ అందించారు. ఆమె విజయవాడ నుంచి పార్లమెంట్ కు ప్రాతినిధ్యం వహించారు.
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో పుట్టిన లక్ష్మణరావు నాగపూర్ లో బీ.ఏ. పట్టా పుచ్చుకున్న తరువాత కలకత్తా విశ్వవిద్యాలయంలో ప్రైవేట్ గా ఎం.ఏ. ఉత్తీర్ణులయ్యారు. తండ్రి వేంకటప్పయ్య కృష్ణాజిల్లా మునగాల పరగణాన దివాను. తన కుమారుడు లక్ష్మణరావు భర్త మాదిరిగానే ఆ హోదాలో ఉండాలన్నది తల్లి గంగమ్మ కోరిక. అలా ఆయన నాగపూర్ నుంచి మునగాల చేరుకున్నారు. ఆ సంస్థానం యువరాజా (మైనర్) రాజా నాయని వేంకట రంగారావుతో స్నేహం కుదిరింది. ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో ఆ బంధం మరింత బలపడింది. ఆ యువరాజావారు దేశభక్తుడు. ఇతర సంస్థానాధీశుల మాదిరిగా పరపాలకుల పట్ల భయభక్తులు ప్రదర్శించే వారు కాదట. పాల్, లాల్, బాల్ త్రయంలో ఒకరు బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటనకు మునగాల రాజా ఏర్పాట్లు చేయగా, కొమఱ్ఱాజు దానిని నిర్వహించారు. బెజవాడ సభకు ఆహ్వాన సంఘాధ్యక్షుడిగా వ్యవహరించారు. అఖిల భాతర కాంగ్రెస్ సభలకు వీరిద్దరూ హాజరయ్యేవారు.
విజ్ఞాన చంద్రికా మండలి
మాతృభాషా సాహిత్యాన్ని సుసంపన్నం చేయాలన్న ధ్యేయంతోనూ, ప్రజలలో ఆధునిక విజ్ఞాన వికాసాల కోసం విజ్ఞానచంద్రికా గ్రంథ మండలి (1906)ని హైదరాబాద్ లో నెలకొల్పారు. రాజా నాయని వేంకట రంగారావు, అయ్యదేవర కాళేశ్వరరావు, డాక్టర్ ఆచంట లక్ష్మీపతి, కొమఱ్ఱాజు సభ్యులు కాగా, ఆదిరాజు వీరభద్రరావు కార్యనిర్వాహక సహాయకులు. మూసీ నది వరదలు (1908), రాజకీయ ఉద్యమాల కారణంగా విజ్ఞానచంద్రికా మండలిని మదరాసుకు మార్చారు. ఆ రోజుల్లోనే ఈ సంస్థకు ఆరు వేలమంది పైచిలుకు చందాదారులుగా ఉండేవారు. మూసీ వరదల సమయంలో విజ్ఞాన చంద్రిక సంస్థ పరిస్థితిపై ఆందోళన చెందుతూ వారు ఉత్తరాల ద్వారా దాని గురించి ఆరా తీయడంలోనే తెలుగు వారు ఆ సంస్థను ఎంతగా ఆరాధించేవారో అర్థమవుతుంది. తెలుగు సైన్స్ గ్రంథాల కొరత తీర్చడానికి జరిగిన తొలి ప్రయత్నమే విజ్ఞానచంద్రిక. ఈ సంస్థ 30 గ్రంథాలు ప్రచురించగా, అందులో సగం, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలే. గురుతుల్యులు కందుకూరి వీరేశలింగం పంతులు స్వీయచరిత్రతో పాటు అనేక చారిత్రక నవలలను ఈ సంస్థ ప్రచురించింది. ‘విజ్ఞానచంద్రికా మండలి సంస్థాపనముతో ఆంధ్రదేశమున సాంస్కృతికముగా ఒక నూతన శకమే ప్రవృత్త మయినది’ అని సుప్రసిద్ధ చరిత్రకారులు మల్లంపల్లి సోమశేఖర శర్మ ప్రశంసించారు. ఈ సంస్థ ప్రచురించిన గ్రంథాలలో కొన్ని పాఠ్య పుస్తకాలుగా ఉండేవి. వాటిలో ఉత్తమశ్రేణి సాధించిన వారికి స్వర్ణ, రజత పతకాలు, నగదు బహమతులు, యోగ్యతా పత్రాలు అంద చేసేవారు. కందుకూరి వీరశలింగం పంతులు, కట్టమంచి రామలింగారెడ్డి, పనప్పాకం శ్రీనివాసాచార్యులు విజేతల ఎంపికకు న్యాయ నిర్ణేతలుగా ఉండేవారు. అలా బహుమతులు అందుకొన్న వారిలో- అనంతర కాలంలో పరిశోధన పరమేశ్వర బిరుదాంకితులు నిడదవోలు వేంకటరావు తదితర ప్రముఖులు ఉన్నారు. చారిత్రక నవలలకు రూ.500 బహుమతులుగా నిర్ణయించగా, భోగరాజు నారాయణమూర్తి ‘విమలాదేవి’, వేంకటశాస్త్రి ‘రాయచూరు యుద్ధం’ ఆ బహుమతులు గెలుచుకొన్నాయి.
విజ్ఞాన సర్వస్వం
దక్షిణ భారతదేశ భాషల్లో విజ్ఞాన సరస్వం ప్రచురణకు కొమఱ్ఱాజు తెలుగులో నాంది పలికారు. ఆంగ్లంలో ‘ఎన్ సైక్లోపీడీయా’ తరహాలో ఆంధ్రంలో గ్రంథం తీసుకురావాలన్నది ఆయన సంకల్పం. అలా ఆయన సంపాదకత్వంలో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం మూడు సంపుటాలుగా (1915-18) వెలువడింది. రెండు వేల పుటలలో 35 అంశాలకు చెందిన వెయ్యి వ్యాసాలు వాటిలో చోటు చేసుకున్నాయి. విజ్ఞాన సర్వస్వ సంపుటాల కోసం ఆయన ఆరోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టలేదు. విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినా, పడుకొనే పుస్తక పరిశీలన జరిపేవారట. మదరాసులో వీరేశలింగం పంతులుకు సహాయకులుగా ‘కవుల చరిత్ర’ను పరిశోధించి ప్రథమ భాగాన్ని ప్రచురించారు. ‘లక్ష్మణరావు గారు తరచూ ఉబ్బసం వల్ల బాధపడుచుండెడివారు. విజ్ఞాన సర్వస్వం రచన పని వల్ల ఆయన ఆరోగ్యం చెడిపోయినది. దానిని ఆయన లక్ష్యపెట్టక ఆ పనిలోనే నిమగ్నుడయియుండెను’ అని అయ్యదేవర కాళేశ్వరరావు తమ స్వీయ చరిత్రలో పేర్కొన్నారు. తెలుగులో విజ్ఞాన సర్వస్వం ప్రకటితమైన తరువాత మరాఠా ‘జ్ఞానకోశ్’ వెలువడింది. దాని ప్రచురణకర్త డాక్టర్ శ్రీధర్ వెంకటేశ్ కేత్కర్ మదరాసులో లక్ష్మణరావుతో చర్చలు జరిపి, ఆయన సలహాలు, సూచనలతో తమ గ్రంథం ప్రచు రించారు.
సాహిత్యపరంగా, ఇతరత్రా లభించే ఆధారాలు, సమాచారం ప్రాతిపదికగా విషయాన్ని నిష్పక్షపాతంగా చెప్పడమే చరిత్రకారుని లక్ష్య మన్నది కొమఱ్ఱాజు సిద్ధాంతం. ఆ కోణంలోనే ‘హిందూ మహాయుగం, మహమ్మదీయ మహాయుగం’ గ్రంథాలు చారిత్రక దృక్పథంలో, పరిశోధనా పరంగానూ విప్లవం సృష్టించాయి. రాజకీయ సంఘటనలు కాల నిర్ణయాలు, వంశ వృక్షాల వర్ణనలే కాకుండా నాటి సామాజిక, మానసిక స్థితులను ఆవిష్కరించారు. ఈ రెండు గ్రంథాలు దేశ చరిత్రకు సంబంధించి తెలుగులో వచ్చిన మొదటి ప్రామాణిక గ్రంథాలుగా పేరు పొందాయి. ‘పరిశోధన విషయమున ఆదిరాజు వారును, మల్లంపల్లి వారు వారికి శిష్యులన్నచో వారికి (కొమఱ్ఱాజు) అందుగల పరిపూర్ణతను గూర్చి వేరుగా చెప్పవలసిన యవసరం ఉండదు’ అని ప్రాచార్యులు డాక్టర్ దివాకర్ల వేంకటావధాని నివాళులు అర్పించారు.
పరిశోధకులుగా…
రామాయణంలో పంచవటి ఎక్కడ? అనే వాదం చెలరేగినప్పుడు బాలగంగాధర్ తిలక్ వంటి ఉద్దండ పండితులతో తలపడి అది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోనిది కాదని, తెలుగు నేలపై భద్రాచలం సమీపంలోనిదని సోపపత్తికంగా కొమఱ్ఱాజు వారు నిరూపించి, ఒప్పించారు. అలాగే, భాగవత తెలుగు కర్త పోతనామాత్యుడు వరంగల్ జిల్లాలోని బమ్మెరవాసి అని ధ్రువీకరించారు. భాగవత అనువాదంలో ప్రస్తావనకు వచ్చిన ఏకశిలానగరం అంటే ఓరుగల్లేనని, కడప జిల్లాలోని ఒంటిమిట్ట కాదని సోపపత్తికంగా నిరూపించారు. ఆంధ్ర భాగవత రచనలో పాలుపంచుకున్న ఏర్చూరు సింగన్న, వెలిగందల నారయ ల గ్రామాలు వరంగల్, ఖమ్మం జిల్లాలోనివే అని తేల్చి చెప్పారు. అపార శాస్త్ర వైదుష్యం కలిగిన ఆయన ప్రకృతి, రసాయన శాస్త్రాలు, కర్మయోగం, లలితకళలు తదితర రచనలు చేసి బహుముఖ ప్రజ్ఞను విమర్శనా పటిమను చాటారు. మరాఠ భాషలో పరిశోధకుడిగా, విమర్శకుడిగా విఖ్యాతుడు. ఆ భాషాకవి మోరోపంత్ ‘మహాభారత్ కర్ణ పర్వం’ను ఆయన పరిష్కరించారు. స్థానిక పత్రికలకు భావ గీతాలు రాసేవారు. ఆయన ఇహలోకయాత్ర చాలించే కొద్దికాలం ముందు ‘లక్ష్మణరావు వ్యాసావళి’ పేరిట రెండు సంపుటాలు వెలువడ్డాయి.
మే 18, 1877న జన్మించిన ‘చారిత్రక’ పురుషుడు తమ 46వ యేటనే చరిత్రలో ‘లీన’మయ్యారు.

